హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో సుమారు 40 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ప్రదర్శనతో పాతబస్తీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. హసన్నగర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి మీదుగా శాస్త్రిపురం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రసంగం చేయనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించనున్నారు. భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మరోవైపు ఈ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి అల్లర్లకు పాల్పడే ప్రమాదం వుందంటూ.. మొత్తం ర్యాలీని వీడియో తీయాలని హైకోర్టు హైదరాబాద్ సిటీ పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు పెట్టమని హైకోర్టు నిర్దేశించింది. సిఏఏని వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీని అనుమతించ వద్దంటూ హైదరాబాద్ బహదూర్పురాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. సిటీ పోలీసుల అఫిడవిట్ కోరింది. ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి మిరాలం నుంచి శాస్త్రిపురం వరకు మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో పోలీసులు అనుమతి ఇచ్చిన పరిధి వరకే ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. నగరంలో ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై తక్షణం కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని హైకోర్టు సూచించింది.
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ముస్లింలు ఇటీవల ఇందిరాపార్క్ వద్ద భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలు ట్యాంక్ బండ్ మీద ప్రదర్శన నిర్వహించారు. ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం కిక్కిరిసిపోయాయి. జాతీయ జెండాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతో ఈ ర్యాలీపై పలు కేసులు కూడా నమోదు చేశారు.
కాగా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ… దేశ వ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.