(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సివిల్ కోర్టు, సబ్కలెక్టర్ కార్యాలయం దగ్గరకు మహిళలు చేరుకున్నారు. పోలీసు ఆంక్షలు ఉన్నా బందరు రోడ్లోకి దూసుకొచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కోర్టు కాంప్లెక్స్ దగ్గర మాజీ జడ్పి చైర్ పర్సన్ గద్దె అనురాధను అరెస్ట్ అయ్యారు.
మరో వైపు బెంజ్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నల్ల చీరలతో మహిళల నిరసన తెలియజేశారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్ట్లు చేస్తున్నారు. ర్యాలీకి అనుమతి లేదని ఇప్పటికే సిపి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. అదనపు పోలీసులను తరలించారు. ప్రైవేట్ వాహనాల్లో రైతులు, మహిళలను బలవంతంగా ఎక్కించి తరలిస్తున్నారు. బందరు రోడ్డులో ఆర్టిఎ ఆఫీస్ వద్ద కూడా రోడ్డుపై మహిళలు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రభుత్వ చర్యల పట్ల మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు మహిళలు తాము షాపింగ్కు వచ్చామని చెబుతున్నా పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.