అత్మహత్య చేసుకున్న ఎయిర్హోస్టెస్ గీతికా శర్మ, ఆమెను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై కోర్టులో కేసు ఎదుర్కొంటున్న గోపాల్ కందా
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ మిగతా పార్టీలకన్నా తాము భిన్నం అని బిజెపి నాయకులు చాలాకాలం నుంచీ చెప్పుకుంటూ వచ్చారు. జనసంఘ్ పార్టీ బిజెపిగా రూపాంతరం చెందిన కొత్తల్లో నిజంగానే ఆ పార్టీ కాస్త భిన్నంగా కనబడింది. కాలక్రమేణా భారత రాజకీయాలలో ఉన్న అన్ని అవలక్షణాలూ ఆ పార్టీకి కూడా అలవడ్డాయి. ఇంకా చెప్పాలంటే మిగతా వాటికన్నా కాస్త ఎక్కువేనేమో. ప్రధానమంత్రి స్వయంగా ఫిరాయింపులకు బహిరంగంగా పిలుపునివ్వడం మరే పార్టీలోనూ జరగలేదు మరి.
మిగతా పార్టీలకూ బిజెపికీ మధ్య భేదం లేకుండాపోయిందని ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి స్వయంగా వ్యాఖ్యానించారు. హర్యానా శాసనసభ ఎన్నికలలో మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోయిన బిజెపి అక్కడ జననాయక్ జనతా పార్టీతో పాటు, కొందరు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. బిజెపికి మద్దతు ఇస్తున్న వారిలో గోపాల్ కందా అనే ఇండిపెండెంట్ సభ్యుడు కూడా ఉన్నారు.
ఆ గోపాల్ కందా మద్దతు బిజెపి స్వీకరించడాన్ని ఉమా భారతి గట్టిగా తప్పు పట్టారు. ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి వరసగా పెట్టిన ట్వీట్లలో ఆమె నైతికత, విలువలకు కట్టుబడి మనం గోపాల్ కందా మద్దతు తీసుకోకూడదు. ఎన్నికలలో గెలిచినంత మాత్రాన నైతికంగా, చట్టపరంగా అతను దోషరహితుడని భావించరాదు అని వ్యాఖ్యానించారు.
వాణిజ్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన గోపాల్ కందా గతంలో భూపేందర్ సింగ్ హుదా ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. తాను నడుపుతున్న ఎమ్డిఎల్ఆర్ (తర్వాత మూతపడింది) ఎయిర్లైన్స్లో పనిచేసే గీతికా శర్మ అనే ఎయిర్హోస్టెస్ను లైంగికంగా వేధించి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై ఆయన ఇప్పటికీ కోర్టులో కేసును ఎదుర్కొంటున్నారు. కుమార్తె మరణం తర్వాత గీతికా శర్మ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఈ పరిణామాల వెంటనే గోపాల్ కందాను హుదా తన మంత్రిమండలి నుంచి తొలగించారు. ఆయనపై అత్యాచారం, ఆత్మహత్యకు పురికొల్పడం ఆభియోగాలపై కేసు పెట్టారు. తర్వాత అత్యాచారం అభియోగం తొలగించారు. ఆత్మహత్యకు పురికొల్పడం ఆభియోగంపై కేసు ఇంకా నడుస్తొంది.
బిజెపిలో ఉన్న వారందరమూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తాము. మనం అలాంటి వారినే దగ్గరకు తియ్యాలి అని ఉమాభారతి పేర్కొన్నారు.
జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కూడా ఈ విషయంపై స్పందించారు. అమిత్ షాను ఉద్దేశించి ఆమె, బిజెపికి ఏది ముఖ్యం, అధికారమా, మహిళల భద్రతా అని ఈ దేశం కుమార్తెలు మిమ్మల్ని గమనిస్తున్నారు అని ట్వీట్ చేశారు. గీతికా శర్మ ఆత్మహత్య చేసుకున్నపుడు కాంగ్రెస్పై బిజెపి నాయకులు చేసిన విమర్శలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా గుర్తు చేశారు.