అమరావతి: ఆరు నెలల్లో తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పిన వైఎస్ జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ పాలన సరిగా లేదని.. అంతా అప్పులు చేస్తున్నారని.. పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలంటూ చురకలంటించారు. జగన్ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి ఆరోపించారు. ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం అని పేర్కొంటూ యనమల సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో…
“గౌ|| వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నారు. కానీ మీ ఆరు నెలల పాలన అందుకు పూర్తి విర్ధుంగా సాగుతోంది. నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో రూ.150కి చేరాయి. తెలుగుదేశం ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఉల్లి అందించి ధరలను అదుపులో ఉంచింది. మీ ప్రభుత్వం కేవలం రైతు బజార్లకే పరిమితం చేయడంతో ధరలు పెరిగాయి. కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. పెంచిన ఇసుక ధరలతో ఇళ్లు కట్టలేని పరిస్థితి కల్పించారు. ఉచితంగా అందుతున్న ఇసుకను రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. పెంచిన మద్యం రేట్లు ఇళ్లను గుల్ల చేస్తున్నాయి. మద్యం ధరలు పెంచడం వల్ల మీరు చెప్పినట్లు వినియోగం తగ్గలేదు. నాటుసారా వినియోగం పెరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం విచ్చల విడిగా దిగుమతి అవుతోంది. లక్షల కొద్దీ మొబైల్ బెల్టుషాపులు వెలుస్తున్నాయి. దశల వారీ మద్య నిషేధం ముసుగులో మద్యతరగతి, పేద కుటుంబాల ఇళ్లను గుల్ల చేస్తున్నారు. మద్యం మాఫియాను అరికట్టలేకపోయారు. మీ మేనిఫెస్టోలోని హామీలకు విరుద్ధంగా మద్యం ధరలు పెంచారు. సిమెంట్ బస్తాకు రూ.110 పెంచారు. టమాటా ధరలు పెరిగాయి. ఇలా ఒకవైపు వినియోగదారులపై ధరల భారం మోపుతున్నారు. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరలు సరిగా లేవు. 286 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. పేదల కోసం వేలాది గృహాలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. వాటిని లబ్దిదారులకు అందించడంలో విఫలమయ్యారు. సంక్షేమ పథకాలకు గోరంత నిధులు కేటాయించి.. కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. రైతు భరోసాతో రూ.13,500 ఇస్తామని హామీ ఇచ్చి.. రూ.7,500కు కుదించారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. పెన్షన్ రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చి.. రూ.250కి కుదించారు. ఆరు లక్షల ఆటోలు ఉండగా.. 2 లక్షలకు కుదించారు. గ్రామ సచివాలయ నియామకాల్లో పేపర్ లీక్ చేశారు. వాలంటీర్లలో 90% వైసీపీ వారేనని మీ ఎంపీ విజయసాయిరెడ్డే ప్రకటించారు. 6 లక్షల మందికి ఇస్తున్న నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. ఖాళీగా ఉన్న 22వేల టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. డీఎస్సీలో అర్హత సాధించిన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పైగా ఏళ్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. కేంద్రం విడుదల చేసిన ఉపాధిహామీ నిధులనూ దారిమళ్లించారు.
తెలుగుదేశం ప్రభుత్వం నాడు మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మీరు విమర్శించారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దని తెలుగుదేశం పార్టీ చెబుతోందంటూ రాజకీయ లబ్ది కోసం కుల తత్వం రెచ్చగొడుతున్నారు. అసలు తెలుగుదేశం ఇంగ్లీష్ వద్దని ఎప్పుడు అన్నది.? బీసీ సీనియర్ మాజీ మంత్రిని బ్రోకర్ అని సంభోధించి బీసీలను అవమానించారు. 6 నెలలైనా ఆదరణ పథకం పరికరాలను గోదాముల్లో ఉంచి బీసీలను నష్టపరుస్తున్నారు. టీటీడీ బోర్డులో 36 మందిని నియమించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేవలం 9 స్థానాలే ఇచ్చారు. ఇదేనా 50% రిజర్వేషన్ ఇవ్వడమంటే. అలాగే కీలకమైన నామినేషన్ పదవులు, ప్రభుత్వ సలహాదారులలో 50% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు.? తెలంగాణ నుండి కేంద్రం నుండి రావాల్సిన నిధులు తేలేకపోయారు. ఏపీ ఆస్తులు ఏకపక్షంగా తెలంగాణకు దారాదత్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మీడియా గొంతు నొక్కడానికి జీవో.నెం.2430 అనే నల్ల జీవోను తీసుకొచ్చారు. ప్రజల పక్షాన నిలబడ్డ ప్రతిపక్షాలపై 630 దాడులు, అక్రమ కేసులు పెట్టారు. 8 మంది హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి గతంలో మీరే కోరారు. కానీ ఆరు నెలలు అయినా ఎందుకు అప్పగించలేదు ?
కేంద్రం, కోర్టు చెప్పినా వినకుండా విద్యుత్ పీపీఏలను రద్దు చేశారు. రూ.4.84లకు వచ్చే సౌర విద్యుత్ కాదని పొరుగు రాష్ట్రం నుండి రూ.11.68కి విద్యుత్ కొన్నారు. కరెంటు కోతలు పెట్టారు. అమరావతిపై దుష్ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చారు. దీంతో లక్షల కోట్ల ఆస్తుల విలువ రాజధానిలో పడిపోయింది. తిరుపతి, విశాఖ లాంటి నగరాల్లో కూడ భూముల ధరలు పడిపోవడానికి కారణమయ్యారు. హైదరాబాద్లో 30% భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ఆపారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరంలో రూ.7,500 కోట్లు నష్టం చేసి మీ కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. ఇలాంటి విధానాలతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ జెండా రంగులు వేయడానికి రూ.1300 కోట్లు ప్రజాధనం దోచిపెట్టారు. మీ సొంత ఇంటికి రూ.17 కోట్లు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ధనం నేలపాలు చేశారు. వాలంటీర్లు తదితర పేర్లతో వైసీపీ కార్యకర్తల్ని నియమించి వారికి రూ.3,200 కోట్లు ప్రజా ధనం ఇస్తున్నారు. ఇసుక కొరత కారణంగా రియల్ ఎస్టేట్ దెబ్బతీసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం పోవడానికి కారణమయ్యారు. 2014లో ఆగాధంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2019 నాటికి ఒడ్డుకు చేర్చి చంద్రబాబు నాయుడు గారు అధికారం మీ చేతికిచ్చారు. మీ కక్ష సాధింపు, స్వార్థపూరిత విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. ఇప్పటికే రూ.33 వేల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బంతా ఏం చేశారు. మీ వారికి కారుచౌకగా ప్రభుత్వ విలువైన ఆస్తులను కట్టబెట్టడానికి ”బిల్డ్ ఏపీ” పెట్టారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుండి కాపాడి సరైన దిశలోకి మళ్లించడానికి శాసనసభలో ప్రతిపక్షాలకు తగు సమయమివ్వాలని కోరుతున్నాము. కక్షపూరిత విధానాలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ, శాసన మండలిని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించడంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తున్నాం.”
యనమల రామకృష్ణుడు
శాసన మండలి పక్ష నేత