(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న ప్రచారంతో కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన తర్వాతే వంశీ రాజీనామా చేయడంతో కచ్చితంగా ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వంశీ చేరికను యార్లగడ్డతోపాటు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్తో కలుస్తానని యార్లగడ్డ ప్రకటించారు. సోమవారం సీఎంతో యార్లగడ్డ భేటీ కానున్నారు. భేటీలో భాగంగా వంశీ రాజీనామా, వైసీపీలో చేరికపై నిశితంగా చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. జగన్ న్యాయం చేస్తారనే విశ్వాసం తనకుందని.. అభిమానుల మనోభావాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితంగా తనకు అనుకూలంగానే నిర్ణయం ఉంటుందని భావిస్తున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. అయితే ఇవాళ వైఎస్ జగన్ ఏం తేల్చబోతున్నారనే దానిపై అటు వంశీ.. ఇటు యార్లగడ్డ అనుచరులు, అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది.
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు విషయంలో తన నిర్ణయాన్ని పండుగ తర్వాత తెలియజేస్తానని చెప్పి పండుగ రోజే షాకింగ్ నిర్ణయాన్ని తెలియజేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. వైసీపీలో చేరాలంటే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని జగన్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి రాజీనామా చేసి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వంశీకి జగన్ హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు వంశీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు ఎన్నికల సమయంలో వంశీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని యార్లగడ్డ వర్గం ఆరోపిస్తోంది. అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్పై తనకు నమ్మకం ఉందని, ఆయన నిర్ణయం తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని యార్లగడ్డ సంచలనానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ, యార్లగడ్డ కార్యకర్తలతో పోటీపోటీ సమావేశాలు నిర్వహించడం కూడా రాజకీయంగా మరింత హీట్ పెంచాయి. గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులతో జగన్ వంశీని స్వాగతిస్తారా? యార్లగడ్డను ఒప్పిస్తా రా? ఇక ముందు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.