అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో మనస్థాపానికి గురైన నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలను బుచ్చగించేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఈ ఇద్దరు నేతలతో సిఎం జగన్మోనహరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం సామాజిక, ప్రాంతీయ సమీకరణాల రీత్యా స్థానం కల్పించలేకపోతున్నట్లు వివరించారు. ప్రమాణ స్వీకారం రోజు అందుబాటులో ఉండాలని రోజాకు ప్రత్యేకంగా సిఎం జగన్మోహనరెడ్డి చెప్పినప్పటికీ గైరుహాజరు అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆ రోజు నుండి రోజా సెల్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు. రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను జగన్ తప్పకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. వారు కూడా మంత్రిపదవి వస్తుందని ఎంతో విశ్వాసంతో ఉన్నారు. తొలి మంత్రివర్గంలో వారికి అవకాశం దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు.
ఈ నేపథ్యంలో వారికి క్యాబినెట్ ర్యాంక్ స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టి బుజ్జగించాలని పార్టీ యోచిస్తోంది. మంగళవారం సాయంత్రానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని రోజాకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిలు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్టిసీ చైర్మన్ పదవి రోజాకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే మాదిరిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా క్యాబినెట్ ర్యాంక్ స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చి సంతృప్తి పర్చనున్నారు.