ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఆదివారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నేతృత్వంలోని బీజేపీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. తమకు సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నట్టు చెప్పారు. బీజేపీ – శివసేనకు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు తీర్పు చెప్పారని, కానీ, శివసేన ఆ తీర్పు చెప్పిన ప్రజలను అవమానిస్తోందని చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. ఒకవేళ శివసేన పార్టీ.. కాంగ్రెస్ – ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము శుభాకాంక్షలు చెబుతామని చెప్పారు.
మహారాష్ట్రలో నవంబర్ 8న అసెంబ్లీ గడువు ముగిసిపోవడంతో సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ శనివారం ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నవంబర్ 11లోపు బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. అయితే, అసలు ప్రభుత్వ ఏర్పాటు చేయకముందే బీజేపీ తప్పుకొంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో 56 స్థానాలతో రెండో పెద్ద పార్టీ అయిన శివసేనకు ప్రభుత్వ ఏర్పాటకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది.
అయితే కేవలం 56 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం శివసేనకు కూడా సాధ్యం కాదు. ఎన్సీపీ-కాంగ్రెస్లను ప్రభుత్వంలో భాగస్వామ్యానికి ఒప్పించడమో, బయట నుంచి ఆ రెండు పార్టీల మద్దతు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో శివసేనకు అనివార్యమవుతుంది. అందు కోసం ఇరు పార్టీలో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తమకు శత్రువు కాదంటూ శివసేన ఆదివారం సంకేతాలు పంపించింది.
ఇదిఇలా ఉంటే.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు జాగ్రత్త పడ్డాయి. ముంబైలోని ఓ హోటల్ లో శివసేన ఎమ్మెల్యేలు మకాం వేయగా.. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించింది. తాజా పరిణామాలతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఉత్కంఠగా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే సీఎం పదవిని 50-50 ఫార్ములా కింద చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన చేసిన ప్రధాన డిమాండ్ను బీజేపీ నిరాకరించడంతో గత 15 రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.