అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని పేరుతో తమను మోసం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పిన తరువాతే రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టాలని అన్నారు ఒక పథకం ప్రకారం రాజధానిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని వారు ధ్వజమెచ్చారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు అనేక హామీలు ఇచ్చారనీ, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కుడున్నాయో కూడా తమకు తెలియడం లేదని పేర్కొన్నారు.
రాజధానికి టిడిపి నేతలు ఎవరూ భూములు ఇవ్వలేదని పేర్కొన్నారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు సుమారు తొమ్మిది వేల ఏకరాలు కొన్నారని రైతులు ఆరోపించారు. మూడేళ్లలో ఫ్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసైన్డ్ భూములకు తక్కువ ప్యాకెజీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని ఆయనతో మొర పెట్టుకున్నామన్నారు. అప్పట్లో తమ బాధలు వినడానికి సీఎం జగన్ ప్రతపక్ష నేత హోదాలో రాజధాని పర్యటిస్తే చంద్రబాబు పసుపు నీళ్లు చల్లించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తే తాము ఏ నీళ్లు చల్లాలో చంద్రబాబే సమాధానం చెప్పాలని కోరారు.
కాగా రాజధాని ఇక్కడే ఉండాలని రైతుల్లో మరో వర్గం చెప్పుకొచ్చింది.మరో పక్క తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులు మాట్లాడుతుండగా వెనుక నుండి వారిని ఆపడం ఏమిటని రైతుల్లో మరో వర్గం ప్రశ్నించింది.