అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఓ గుడిలో ఉన్న శిరిడీ సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండాను కట్టారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ వాళ్లు కట్టిన జెండాను మరుసటిరోజే తొలగించామని పూజారులు చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం అయిన చీపురుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదీ వదలకుండా పార్టీ జెండా రంగులేస్తోన్న వైసీపీ కార్యకర్తలు ఇటీవల ఆలయాల్లో కూడా ఆపార్టీ రంగులు వేశారు. ఆ పార్టీ నేతల రంగుల పిచ్చి శ్మశానాల దాకా విస్తరించింది. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల డివైడర్లకు కూడా వైసీపీ రంగులు వేశారు. ఇప్పుడు సాయిబాబాకు వైసీపీ జెండాను కట్టారు. మొత్తానికి ఈ ఘటనతో మరోసారి వైసీపీ అడ్డంగా అయ్యింది. మరోవైపు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ వారి పార్టీ రంగులు వేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.