(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా తమకు ఒకటేనని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వారికి ఆ అవకాశం కల్పించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ రాజధాని గ్రామాలలో ఒకటయిన పెనుమాక నుంచి ర్యాలీ తీయబోయిన ఆర్కేను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసులోని మూడు రాజధానుల మాట బయటకువచ్చిన నాటి నుంచీ రాజధాని అమరావతి గ్రామాలలో ప్రజలు ఆందోళన బాట పట్టారు. వారి నిరసనలను పోలీసులు చాలా కఠినంగా అణచివేశారు. మహిళలపై కూడా దాడులు చేశారు. దానితో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ స్యుమోటోగా దీనిని విచారణకు స్వీకరించి ప్రతినిధి బృందాన్ని పంపింది.
మరోపక్క రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షనేతల ర్యాలీలకు, సభలకూ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. అదే సమయంలో అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ అధికారపక్షం నాయకులు ర్యాలీలు మొదలుపెట్టారు. వారికి పోలీసుల అనుమతి లభిస్తుండడం మరో విమర్శకు దారి తీసింది. దీనితో పోలీసులు అమరావతినే ఎంచుకుని ఆర్కే ర్యాలీకి అనుమతి నిరాకరించారు. అయినా గానీ ర్యాలీ జరిపి తీరుతానన్న శాసనసభ్యుడిని అరెస్టు చేశారు. ఇక ప్రతిపక్ష నాయకులు తమపై విమర్శలు చేస్తే పోలీసుల దగ్గర సమాధానం ఉంటుంది.