అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతిఒక్కరికీ వైసిపి ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు అంశాలపై వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నించిన టిడిపి నాయకులు మరో సారి పెన్షన్ల పేరు చెప్పి ఆ పని చేయాలని చూస్తున్నారనీ, వారి మాటలను ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరనీ బొత్స అన్నారు
ఇప్పటికే 53,70,210 మందికి పెన్షన్లు అందించామని వెల్లడించారు. ఇవి కాకుండా 31,690 ఆరోగ్యపరమైన పెన్షన్లు కూడా ఇచ్చామనీ తెలిపారు. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని వెల్లడించారు. 4,16,034 మందిని ఫించన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించారనీ, వీరిలోనూ పునః పరిశీలన చేసి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామనీ చెప్పారు.
వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలో ఉన్నారనీ, ఈ నెలతో కలిపి వారిలో అర్హులైన వారికి రెండు నెలల పెన్షన్ ఇస్తామనీ బొత్స వెల్లడించారు. పెన్షన్ల్ సంఖ్య ను తగ్గించుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. 300 యూనిట్లు విద్యుత్ వాడుతున్న వారి సంఖ్య ఎనిమిది వేలు పైచిలుకు వచ్చిందనీ, .వీరి గురించి కూడా పరిశీలన చేస్తున్నామన్నానీ చెప్పారు.
అధికారం కోల్పోయి అసహనంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. స్వయంగా కియా సంస్థ ప్రతినిధులు చెప్పినా కియా మోటార్స్ సంస్థ తరలిపోతోందని టిడిపి గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దావోస్ పర్యటనలు అంటూ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఎక్కడికైనా వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ‘వోక్స్ వేగన్ వ్యవహారంలో అమాయకంగా నమ్మి మోసపోయాను. దానిపై సీబీఐ దర్యాప్తు కూడా వేసుకున్నాం.
ఎప్పుడైనా చంద్రబాబు ఇలా చేయగలిగారా’ అని బొత్స ప్రశ్నించారు. కియా ఇచ్చిన రీజాయిండర్ ను రాయిటర్ సంస్థ ప్రచురించాలని బొత్స అన్నారు.