ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు రద్దు. కొత్త సంవత్సరం సందడి అని దాదాపు అన్ని ఛానళ్ళు వార్తలు లేవండహో అని మూడు నాలుగు నగరాల నుంచి వీధులలోనో, పార్కుల్లోనో, క్లబ్బుల నుంచో ప్రత్యక్ష ప్రసారం. ఇప్పుడు వార్తలు అనే తిమ్మి బమ్మి అయిపోయింది. కనుక తిమ్మి ఇలా అంటుందని ఎవరు చెప్పినా ఎవరూ నమ్మేట్టు లేరు. వార్తలు అనేవి మనకు అవసరమైనపుడు ఉత్పన్నం కావు; వద్దనుకున్నపుడు సంభవించకమానవు. ఇది చాలా పాత ఆలోచన. కానీ నేడు వార్తలు అంటే మేము ఇచ్చేవి వార్తలు, మీరు చూసేవి వార్తలు అనేలా తయారైంది.
వార్తాపత్రిక తీసుకోండి – అందులో మన ప్రాంతం, రాష్ట్రం, దేశం, క్రీడలు, వాణిజ్యం, అంతర్జాతీయం, ఆరోగ్యం, ఆటవిడుపు – ఇలా వార్తలు వ్యాపించి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి మొదటి పేజీని ఆక్రమించి ఉంటాయి. ఏమి జరిగిందో సమాచారం తొలుత ఇచ్చి, తద్వారా అవసరమైన వివరాలు ఇవ్వడం ఇది వరకు ఉన్న విధానం. తర్వాత న్యూస్ పేపర్లకు పీరియాడికల్స్కూ పెళ్ళి జరిగిపోయింది. ఫలితంగా సినిమా పత్రికలు, మహిళా పత్రికలు, హాస్యపత్రికలు, ఆరోగ్య పత్రికలు, రాజకీయ పత్రికలు అనేవి లేకుండా అన్నీ దినపత్రికల గంగా ప్రవాహంలో కలసిపోయాయి. ఇది జరిగిన తర్వాత మనకు తెలుగు న్యూస్ ఛానళ్ళు బయలుదేరాయి. కనుకనే న్యూస్ ఛానళ్ళలో సగం సమయం వార్తలు, మిగతా సగం సమయం ఇలాంటి సమాచారం ఇవ్వడం మొదలైంది.
తెలుగులో ఈ పరిణామానికి ముందు ఈటీవీ గంటగంటకూ ఐదునిమిషాల వార్తలు ప్రవేశపెట్టింది. మరాఠీ వంటి భాషలలో ఈ ప్రయోగం విజయవంతమైనా, తెలుగులో దీనిని రద్దు చేయక తప్పలేదు. ఇప్పటికీ ప్రయివేటు తెలుగు వార్తా ఛానళ్ళలో న్యూస్ బులెటిన్ అంటే ఈటీవీ రాత్రి 9 గంటలకూ, ఉదయం 7 గంటలకూ ఇచ్చే బులెటిన్లు మాత్రమే! అన్ని రంగాలకు చెందిన వార్తలతో, అనవసరమైన సమాచారం లేకుండా చర్చలు, అభిప్రాయాలు ప్రత్యేకంగా లేకుండా బులెటిన్ను నడపడం ఈటీవీలో చూడవచ్చు. వారు అదనంగా రెండు న్యూస్ ఛానళ్ళు ప్రారంభించిన తర్వాత కూడా ఈటీవీలోని న్యూస్ బులెటిన్లను రద్దు చేయలేదు.
గత దశాబ్దమున్నర కాలంలో 15, 20 దాకా తెలుగు వార్తా ఛానళ్ళు మొదలయ్యాయి, కొన్ని మూతబడ్డాయి, కొన్ని పేరు మార్చుకున్నాయి, కొన్నింటికి యజమానులు మారారు. అంతేకాదు వార్తలు అంటే విలేఖర్లు కూడా లేకుండా ఒకరిద్దరిని కూర్చోబెట్టుకుని కేకలు వేసుకోవడం అనే ధోరణికి వచ్చారు. ఫలానా విషయం లేదు అనే స్పృహ ఈటీవీతో సహా ఏ వార్తా ఛానల్కూ లేదు. దాని గురించి అవగాహన ఉండి లేదా లేకుండానే వార్తల బులెటిన్ నడుపుతున్నారు. అరుపులు, కేకలు ఎక్కువయ్యాయని మరోవైపు స్పీడ్ న్యూస్; రాపిడ్ న్యూస్; 5 నిమిషాలు 25 వార్తలు; 2 రాష్ట్రాలు ఇరవై అంశాలు; మా ఊరు 60 ఇలాంటి విచిత్రమైన పేర్లతో వార్తలు ఇస్తున్నారు. ఇందులో గడగడ వార్తలు చదివేస్తుంటారు. ఎందుకంత వేగంగా చదవాలో, ఎవరికోసమో బోధపడదు. ఇంతగా పరుగులెత్తి వార్తలు చదివి, పిమ్మట గంటపాటు లేని విషయం గురించి గొడవపడుతూ చర్చిస్తూ ఉంటారు. మధ్యలో ఏ మహానుభావుడైనా అరగంటకు డబ్బులిచ్చి అదుకుంటే మనకు విముక్తి లేదా అదే విషయం మరుసటి రోజు అయినా మరోరకంగా కొనసాగుతుంది.
ఏకబిగిన ఆరుగంటలు వరుసగా టీవీలో వార్తలు చూసేవారికి అయినా, లేదా వేరే పనులు ముగించుకుని ఒకరోజు తర్వాత వార్తలు చూసే వారయినా ఛానల్ వారికి ఒకటే! మాకు తోచింది ఇస్తాం, టీఆర్పీలు గడిస్తాయని మేము పరిగణించివే మేము ఇస్తాం లేదా మా మేనేజిమెంటు ఇవ్వమన్న వార్తలు ఇస్తాం – అనే రీతిలో న్యూస్ బులెటిన్లు సాగుతున్నాయి. ఈ గడబిడకు సోషల్ మీడియా గందరగోళం పూర్తిగా అదనం. సరిగ్గా ఈ సందర్భంలోనే పత్రికలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనుకనే పత్రికలు నిలబడుతున్నాయి. ఈ విషయాన్ని టీవీ ఛానళ్ళు గమనించలేవు; ఒకవేళ గమనించినా పోటీ ఛానళ్ళు కళ్ళకు గంతలు కట్టి అదే దారిలో దింపుతాయి.
‘సరిలేరు నాకెవ్వరు’ అంటూ ప్రతి ఛానల్ తన రాజకీయ, వాణిజ్య, వినోద పంథాలో సాగుతోంది. ఛానళ్ళ రథాల క్రింద వార్తలు నలిగిపోతున్నాయి, వాటితోపాటు వార్తలను ఇష్టపడే వారు కూడా నలిగిపోతున్నారు!
డా. నాగసూరి వేణుగోపాల్