(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చిన వారికి 80 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) అందిస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ జనరల్ సులేమానీ చనిపోయిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ప్రతిపాదన చేసింది. దేశంలోని ప్రతి పౌరుడు తలా ఒక డాలర్ చొప్పున పోగుచేసి ఆ మొత్తాన్ని ట్రంప్ ప్రాణాలు తీసిన వారికి రివార్డుగా ఇస్తామని ఇరాన్ పేర్కొంది. ‘ఇరాన్ జనాభా 80 లక్షలు. మా దేశ జనాభా ఆధారంగా ట్రంప్ తల నరికి తెచ్చివారికి రివార్డు ప్రకటించాం’అని ఇరాన్ అధికారిక ఛానెల్ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం సులేమానీ శవయాత్ర చేపట్టారు. వేలాది సంఖ్యలో జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ .. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంతాప ప్రార్థన సమయంలో ఖమేనీ భావోద్వేగానికి లోనయ్యారు. శవపేటిక ముందు నివాళి అర్పిస్తున్న సమయంలో ఖమేనీ కంటతడి పెట్టారు.
కాగా, ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం(జనవరి 3) అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమానీ, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన ఆమెరికాలో నెలకొంది. అయితే, ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం(జనవరి 4) ట్రంప్ ట్వీట్ చేశారు.
https://twitter.com/realDonaldTrump/status/1213689342272659456