అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ఆందోళనను పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ కోర్టుల్లో కేసులు వేస్తామని ఆయన తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
అమరావతిని స్మశానం, ఏడారి అంటూ అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్యగా కనకమేడల అభివర్ణించారు. సిఎంలు శాశ్వతం కాదనీ, అమరావతి రాజధానే శాశ్వతమనీ ఆయన అన్నారు.
అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయని కనకమేడల స్పష్టం చేస్తూ ఒక్క కలంపోటుతో రాజధానిని తరలిస్తామంటే కుదరదని అన్నారు. జిఎన్ రావు కమిటీకి చట్ట బద్దత లేదని ఆయన తెలిపారు.జగన్ ఎప్పుడూ కబ్జాదారుగానే ఉన్నారనీ అందుకే రైతుల బాధ అర్ధం కావడం లేదనీ కనకమేడల విమర్శించారు. రాజధానే కాదు, హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధానిని, హైకోర్టును తరలిస్తే అమరావతిలో ఇంకేముంటుందని ఆయన ప్రశ్నించారు. విభజన సందర్భంలో జరిగిన నష్టం కంటే, గత ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ అని కనకమేడల అన్నారు.