(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇరాక్లోని అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా 15 క్షిపణులతో దాడి చేశామని… ఈ దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. ఒకవేళ అమెరికా మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఆ దేశానికి చెందిన 100 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడిచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తాము జరిపిన తాజా దాడిలో అమెరికాకు చెందిన హెలికాప్టర్లు, భారీ ఎత్తున మిలిటరీ పరికరాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
తమ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. అనుకున్నట్లుగానే క్షిపణులతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైన్యాలు పశ్చిమాసియాను విడిచివెళ్లాలని సూచించింది.
ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మంగళవారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇరాక్లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై డజనుకుపైగా క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్ ధ్రువీకరించింది. అయితే, ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని అమెరికా ప్రకటించింది.
https://twitter.com/realDonaldTrump/status/1214739853025394693
ఇదిలా ఉండగా ఇరాక్ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్ క్షిపణి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో ‘ఆల్ ఈజ్ వెల్’ అని పేర్కొన్నారు. క్షిపణి దాడులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పశ్చిమాసియాకు మరిన్ని బలగాలను తరలించాలని ఆదేశించారు. ఇరాన్ మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.