హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ నీటి తరలింపుకు సంబంధించి వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిచాలని నిర్ణయించుకున్నతర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్ లో జరిగింది.
ఉన్నంతవరకూ నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకుని ఉభయ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకూ సాగునీరు, తాగునీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా పచ్చగా కళకళలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనీ ఇరువురూ అభిప్రాయపడ్డారు.
నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను విస్మరించి సపహృద్బావంతో రెండు రాష్ట్రాలకూ సాధ్యమైనంత మేలు చేసేందుకు తాము ఏకాభిప్రాయంతో ఉన్నామని వారు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు.
ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం, సిఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సి ఎం.వెంకటేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటెల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు
కెసిఆర్ మొదట మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో మంచి మార్పు వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
‘‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్లు సొంతం కోసం ఆలోచించరు. ప్రజల కోసమే ఆలోచిస్తారు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే అభివృద్ధి సాధ్యం.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’’ అని కేసీఆర్ చెప్పారు.
కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. నీటి తరలింపు విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’’ అని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు.