(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడలో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య జరిగి 12 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు డిసెంబర్ 27న తెనాలిలోని గాంధీచౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. తమ కూతురు చనిపోయి 12 ఏళ్లు అవుతున్నా తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని, ఆయేషా మీరాకు న్యాయం జరగలేదని ప్రజలు కూడా భావిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ‘న్యాయాన్ని పరిరక్షిద్దాం, ఆడబిడ్డలను కాపాడుకుందాం’ అనే నినాదంతో పోరాటం జరుపుతామన్నారు. ఈ పోరాటంలో మహిళా సంఘాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
2007 డిసెంబర్ 27వ తేదీన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలిలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున ఆధారాల సేకరణ సీబీఐకి పెద్ద సవాల్గా మారింది. అందుకే మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించారు.
ఆయేషా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పటికీ అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు, అతని మిత్రులు, హాస్టల్ వార్డెన్ లపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులు ఎవరన్నది తేలుతుందా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, తమ కూతురు చనిపోయి 12 ఏళ్లు అవుతున్నా తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయేషా హత్య జరిగిన డిసెంబర్ 27నే తెనాలిలోని గాంధీచౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేయాలని నిర్ణయించారు.