విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ఇండియన్ బ్యాంక్ నుండి భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. అయితే అయిదేళ్ల క్రితం గంటా ఆ సంస్థ భాగస్వామ్యం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రుణానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు ష్యూరిటీ సంతకం చేసి ఉండటంతో బ్యాంకు అధికారులు రుణాన్ని తిరిగి చెల్లించాలని గత నెల నాల్గవ తేదీన గంటాకు డిమాండ్ నోటీసు పంపారు. ఈ నోటీసుపై ఆయన స్పందించకపోవడంతో డిసెంబర్ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.
మొత్తం రుణం బకాయిలు 209 కోట్ల రూపాయలు కాగా తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 35 కోట్ల 35 లక్షల 61వేలు రూపాయలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మిగిలిన బకాయిల కోసం గంటా వ్యక్తిగత ఆస్తిని వేలం వేసే అధికారం తమకు ఉందని ఇండియన్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని గంటా వ్యక్తిగత ఫ్లాట్ వేలం వేయడానికి బ్యాంకు అధికారులు నోటీసు జారీ చేశారు.