(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీకి మూడు కాదు రెండు రాజధానుల ఆలోచన సరైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఉన్న ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు బాధపడుతుంటే తాము ఎలా ఆనందంగా ఉండగలమని అన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు అనుసరిస్తున్న పద్ధతి సరిగా లేదని, అణిచివేత ధోరణి కరెక్టు కాదని హితవు పలికారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ కమిటీలు విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సిఫారసు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పారు. విశాఖకు ఉన్న అర్హత, ప్రత్యేకతల వల్లే అన్ని కమిటీలు సానుకూల నివేదికలు ఇచ్చాయని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని వస్తే ఇతర దేశాల నుంచి ఇక్కడికి పెట్టుబడులు వస్తాయన్నారు. రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా విశాఖ అనుకూలమని అభిప్రాయపడ్డారు. అదే, అమరావతిలో అయితే అలా కుదరదని, అక్కడి భూముులు వ్యవసాయం చేసేందుకే అనుకూలమని చెప్పారు. అమరావతిలో ఏ నిర్మాణం కట్టాలన్న ఎక్కువ అడుగుల్లో పునాదులు తవ్వాల్సి వస్తుందని, చిన్న కల్వర్టు కట్టాలన్నా భారీ ఖర్చు అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా అమరావతిలో భూములు విక్రయించి, ఆ వచ్చిన డబ్బును రాజధాని నిర్మాణానికి వినియోగించవచ్చని చంద్రబాబు చెబుతున్నారు కానీ, అది ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యం అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనల పైన ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ రెండూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఆ రెండు నివేదికల్లోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా సిఫార్సు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులుంటాయని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనప్పటి నుంచి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ మూడు పార్టీల్లోని నేతలు ప్రాంతాలవారీగా విడిపోయి భిన్న ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
మూడు రాజధానుల ప్రతిపాదనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ రాజకీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక రాజధానినే కట్టలేని ఆయన.. మూడు రాజధానులెలా కడతారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో నిలదీశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చితే కేంద్ర ఒప్పుకోదని, ఒకవేళ అలా చేస్తే కేంద్రానికి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. తాజాగా వారి వ్యాఖ్యలకు భిన్నంగా విష్ణుకుమార్ రాజు.. విశాఖ రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. మరో పది కమిటీలు ఏర్పాటు చేసినా విశాఖనే రాజధానిగా చేయాలని చెబుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఎంచుకోవడంపై కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయాలను పక్కన పెడితే.. అమరావతి రైతులకు మాత్రం కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఓవైపు మూడు రాజధానులు ప్రకటనను బీజేపీ వ్యతిరేకిస్తుంటే..ఆపార్టీ చెందిన నేత విష్ణుకుమార్ రాజు రెండు రాజధానుల వాదనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో ? వేచి చూడాలి.