లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లా చదువుతున్న 23 ఏళ్ల యువతిపై సంవత్సరం పాటు అత్యాచారం చేసిన కేసులో ఆయనను సిట్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. న్యాయశాస్త్ర విద్యార్థిని చిన్మయానందపై అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు చిన్మయానందపై రేప్ కేసు పెట్టలేదు. లైంగిక చర్యకోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న అభియోగం ఆయనపై మోపారు. దీనిని అత్యాచారం కిందకు రాని లైంగిక చర్య అనవచ్చు. ఈ అభియోగానికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.అదే అత్యాచారం అయితే ఏడు ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష వేయవచ్చు.
విద్యార్ధిని అందజేసిన వీడియోలు చినమయాంనందకు చూపించగా అందులో ఉన్నది తానేనని ఆయన అంగీకరించినట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారి నవీన్ అరోరా తెలిపారు. చేసిన పనికి తాను సిగ్గు పడుతున్నానని ఆయన అన్నట్లు అరోరా చెప్పారు.
తాను స్నానం చేస్తుండగా రహస్యంగా ఫొటోలు తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా చెప్పింది. పలుసార్లు తనను తుపాకితో బెదిరించి చిన్మయానంద గదికి తీసుకువెళ్లేవారని ఆమె చెప్పింది. తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని ఆ విద్యార్థిని కోర్టులో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చింది. తన ఆరోపణలకు ఆధారాలుగా వీడియోలను పెన్డ్రైవ్లో విచారణ బృందానికి బాధితురాలు అందజేసింది. శుక్రవారం ఉదయాన్నే షాజహాన్ పూర్ లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు.. చిన్మయానందను అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయంలో చిన్మయానంద్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. అయితే చిన్మయాంద్ కు చెందిన ఓ కళాశాలలో చదువుతున్న న్యాయ విద్యార్థిని ఇటీవలే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బ్లాక్ మెయిల్ చేసి చిన్మయానంద్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. గత ఆగస్ట్ 24న ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తర్వాత వారం రోజుల పాటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల తరువాత యూపీ పోలీసులు ఆమెను రాజస్థాన్లో గుర్తించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసుకి సంబంధించిన సిట్ ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధిత విద్యార్థినిని దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఆమె నుంచి అనేక వివరాలు తీసుకుంది. అనంతరం స్వామి చిన్మయానంద్ ను కూడా దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. అయితే, అప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయకపోవడంతో పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాను చనిపోతేగానీ చిన్మయానంద్ పై కేసు పెట్టరేమెనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్మయానంద్ ను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.