న్యూఢిల్లీ: దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో భగ్గుమన్న హిందీ వ్యతిరేకతకు కేంద్రం తలొగ్గింది. దక్షిణాది రాష్ట్రాలలోని విద్యార్ధులు కూడా తప్పనిసరిగా హిందీ భాష నేర్చుకోవాలన్న నిబంధనను నూతన విద్యావిధానం ముసాయిదా నుంచి తొలగించింది.
మారిన 2019 విద్యావిధానం ముసాయిదా ప్రకారం హిందీయేతర రాష్ట్రాలలోని విద్యార్ధులు హిందీకానీ, మరో భాష కానీ ఎంచుకోవచ్చు. తప్పనిసరిగా హిందీ ఎంచుకోవాలన్న నియమం లేదు. 6,7 తరగతుల విద్యార్ధులు త్రిభాషా సూత్రం ప్రకారం తాము చదవాల్సిన భాషను మార్చుకోవచ్చు. మూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం ముఖ్యం అని మారిన ముసాయిదా పేర్కొంటున్నది.
ముసాయిదాను మార్చక ముందు, త్రిభాషా సూత్రం కింద ఇంగ్లీష్, హిందీ భాషలు నేర్చుకోవడం కొనసాగుతుంది. అది హిందీ రాష్ట్రలలోనయినా, హిందీయేతర రాష్ట్రాలలోనయనా సరే అని అది పేర్కొంటున్నది. 8వ తరగతి వరకూ తమపై హిందీ బలవంతంగా రుద్దే ప్రయత్నం కేంద్రం చేస్తోందని దక్షిణాది రాష్ట్రాల విద్యార్ధులు రోడ్లపైకి వచ్చారు. తమిళనాడులో ఈ నిరసన మరీ తీవ్రంగా కనబడింది.