(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశం మరోసారి సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్చకు తెర తీసింది. టిడిపి తరపున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారనీ, తమ నాయకులపై అసభ్య పోస్టులు పెడుతున్న వైసిపి కార్యకర్తలను మాత్రం ఉపేక్షిస్తున్నారనీ ఆయన ఆరోపించారు.
చంద్రబాబు చేసిన ఆరోపణల్లో కొంతన్నా నిజం ఉండిఉంటుంది. పోలీసులు అధికారపక్షం కొమ్ము కాయడంలో వింతేమీ లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవరు అధికారంలో ఉన్నా ఇదే వరస. అయితే టిడిపి అధికారంలో ఉన్న గత అయిదేళ్లలో కూడా సోషల్ మీడియా ప్రచారంలో వైసిపిదే పైచేయి అయింది. దానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ కొంతవరకూ కారణం. ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ధీమాతో వైసిపి శ్రేణులు మరికాస్త రెచ్చిపోతూ ఉండొచ్చు.
పార్టీ పరంగా నడిపే సోషల్ మీడియా విభాగాల సంగతేమో కానీ వ్యక్తిగతంగా ఆయా పార్టీలకు మద్దతుగా నిలుస్తున్న కార్యకర్తలు, అభిమానులు మాత్రం చాలా సందర్భాలలో మరీ అన్యాయమైన పోస్టులు పెడుతున్నారు. కొందరు తమ పోస్టుల్లో వాడే భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నది. ఎదుటి వ్యక్తి సభ్యతా సంస్కారాలు ఉన్నవాడైతే సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. అలాంటి బూతులతో కూడా పోస్టులు పెడుతున్నారు.
ఎదుటి వ్యక్తి అభిప్రాయానికి తన అసమ్మతి తెలిపేందుకు బూతులు ఎంచుకునే వ్యక్తి అవే బూతులు తనకు ఎదురయినా పట్టించుకోడు. అలాంటి బూతులు మహిళల పట్ల వాడేందుకు కూడా చాలామంది వెనుకాడడం లేదు. చంద్రబాబు ఉదహరించిన పంచుమర్తి అనూరాధ ఉదంతమే తీసుకుందాం. ముఖ్యమంత్రి జగన్పై విమర్శ చేసినందుకు ఆమెకు సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు, దూషణలు ఎదురయ్యాయి.
అసభ్యమైన పోస్టులు ఎదురయినపుడు తిరిగి అసభ్యమైన పోస్టులు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని సోషల్ మీడియాను బహిష్కరించనూ లేం. విమర్శ కూడా హుందాగా చేయడం వల్ల చాలావరకూ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. విషయానికి పరిమితమై సభ్యత వీడకుండా విమర్శ చేసేవారి జోలికి వచ్చేందుకు ఎవరైనా జంకుతారు. అయితే సమస్య ఏమంటే దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయవిమర్శ స్థాయి మరీ దిగజారింది.