అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను సీఎం ప్రధానితో చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలుపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ఇప్పుడు తీవ్ర ఆర్థికలోటులో ఉంది. దీంతో రాష్ట్ర పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించి నిధుల విషయంలో అభ్యర్థించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15న ప్రారంభించనున్న వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి ప్రధానిని వైఎస్ జగన్ ఆహ్వానించనున్నారు. గత నెలలోనూ ఢిల్లీలో పర్యటించారు సీఎం జగన్. ఆగస్టు 6న ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సహా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస రోజుల్లో ప్రధాని మోదీని కలవబోతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల కేసీఆర్, జగన్ హైదరాబాద్లో సమావేశమై ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాల్సిందిగా ఇరువురు సీఎంలు మోదీని కోరే అవకాశముంది. చాలా రోజులుగా బిజెపికి దూరంగా ఉంటూ వచ్చిన కెసిఆర్ ఒక్క సారిగా ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకోవడంతో ఏదో ముఖ్యమైన విషయమే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.