(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమాలపై జ్యూడిషియల్ విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు. భూ కుంభకోణాల్లో చంద్రబాబు, జగన్ దొందూ దొందేనని విమర్శించారు.
టీడీపీ హయాంలో సిట్ రిపోర్టును బయటపెట్టలేదనీ, ఇప్పడి వైసీపీ ప్రభుత్వంలోనూ అంతేననీ నారాయణ అన్నారు. టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావులున్నందునే సిట్ రిపోర్టులు దాచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములు కాపాడాలని ఆందోళన చేస్తుంటే సిపిఐ నాయకులపై కేసులు పెడుుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారికి ఏమీ కాకుండా ప్రభుత్వమే రక్షణ ఇస్తుందనీ, ఇదేం విడ్డూరం అని ప్రశ్నించారు.
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చెబుతున్న పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమి కబ్జా గురైందని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ విధానం సరికాదని చెప్పారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అయితే విశాఖలో ఒప్పు ఎలా అవుతుందని నారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులనే వైసీపీ ప్రభుత్వం కాపీ కొడుతోందని విమర్శించారు. పేదల భూములు లాక్కుని ఇళ్లు నిర్మిస్తామనడం సరికాదనీ, ప్రభుత్వ భూమి రెండు వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నాయినీ అయన పేర్కొన్నారు. కావాలంటే మేము ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉందో వివరాలు అందిస్తామని తెలిపారు.
విశాఖలో ల్యాండ్ పూలింగ్ కు రైతులు భూములు ఇచ్చినట్లైతే చెవులు కోసుకుంటాననీ నారాయణ సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేసి భూములు లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు.