(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో సన్నిహితం అవ్వడంపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన, బిజెపి పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నుండి జనసేనతో కలిసి పని చేసిన సిపిఐ ఈ చర్యలతో దూరం అవుతోంది.
గురువారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో నడ్డాను కలిశాక ఆయన పవన్కు బందరు లడ్డూ ఇచ్చారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ బిజెపిని గతంలో విమర్శించిన పవన్ ఇప్పుడు బిజెపితో ఎందుకు కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీకి వెళ్లిన నేతలు జెఎన్యుకు వెళుతుంటే పవన్ బిజెపి ఆఫీసుకు వెళ్లారని విమర్శించారు. దమ్మున్నవాడే బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడతారనీ, పవన్కు దమ్ముందో లేదో సమాధానం చెప్పాలన్నారు.
‘చేగువేర’ ఆదర్శమన్న పవన్ నేడు ‘చెంగు వీర’ అయ్యారు అంటూ రామకృష్ణ విమర్శించారు.