మానవ వనరుల శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు తీరే వేరు. ఎక్కడా ఆయన గొంతు వినబడదు. సైలెంట్గా పని చేసుకుపోవడం ఆయన నైజం. పెద్దగా వార్తల్లో కూడా ఉండే మనిషి కూడా కాదు. ఇంతవరకూ ఎక్కడా ఆయనకు అపజయం ఎదురు కాలేదు.
ఈ ఎన్నికల్లో ఘంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఇది ఆయనకు అయిదవ ఎలక్షన్. ఒక్క సారి కూడా ఓటమి పాలు కాలేదు. కానీ ఓడిపోకపోవడం విశేషం కాదు. పోటీ చేసిన ప్రతిసారీ నియోజకవర్గం మార్చడం విశేషం.
ఘంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం టిడిపితో మొదలయింది. 1999 ఎన్నికలలో ఆయన అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004లో చోడవరం శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే గెలుపొందారు. 2009 ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఘంటా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్పై ఈసారి అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి గెలిచారు.
చిరంజీవి పార్టీలో చేరడం ఆయనకు కలిసొచ్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినపుడు ఘంటా మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. నవ్యాంధ్రలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని అర్ధమైన ఘంటా మళ్లీ పుట్టిల్లు అయిన టిడిపి చేరారు. ఈసారి భీమునిపట్నం నుంచి అసెంబ్లీకి ఎన్నికయి మంత్రి కూడా అయ్యారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ సీటు మారింది. ప్రతిసారీ సీటు మారడమే ఆయనకు కలిసివస్తుందమోనని అనుకునేవారూ లేకపోలేదు. విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బిజెపికి చెందిన విష్ణుకుమార్ రాజు. ఆయన పోటీ చేస్తారో లేదో ఇంకా తెలియదు. చేస్తే జనసేన టికెట్పై పోటీ చేయవచ్చని కూడా వినబడుతోంది. వైసిపి ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయలేదు. ఎదురుగా ఎవరున్నా ఘంటా గట్టి అభ్యర్ధి అన్న విషయంలో అనుమానం లేదు.