విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకునేందుకు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు బయటకు రావాలని పిలుపునిచ్చారు.
తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలోని వారు వారి భాషను సంరక్షించుకుంటున్నారని అన్నారు. తమిళ భాషపై చిన్న మాట అంటే ఆ రాష్ట్రం మొత్తం ఒక్కటైందని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా అక్కడ అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో భాషాభిమాన్ని ఎలుగెత్తారని అన్నారు. మన రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు మాతృభాషపై, సంస్కృతిపై ప్రేమ లేకపోవడం దౌర్భాగ్యమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపైనా రాజకీయాలు తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాషను చంపుకోవడం అంటే ఉనికిని చంపుకోవడమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. తెలుగు భాషలో చదవాలనే ఆసక్తి కలిగిన ఒక విద్యార్థి ఉన్నా ఆ గ్రామంలో ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని కొనసాగించి తీరాలని పవన్ డిమాండ్ చేశారు.