అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి ప్రకటనను ఎవరూ ఆశించలేదు.
తెలుగు మీడియాలో ఈ వార్త రాగానే జాతీయ మీడియా కూడా అప్రమత్తం అయింది. ఎందుకంటే దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రీ ఈ ప్రయోగం చెయ్యలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ చేయబోతున్నది ఖచ్చితంగా దేశంలో ప్రప్రధమం.
నిజానికి ఉమముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు. ఉప ముఖ్యమంత్రి గానీ, ఉప ప్రధాని కానీ ఉండవచ్చన్న మాట రాజ్యాంగంలో ఎక్కడా కనబడదు. ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిందే. తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం మేరకు ఉప ముఖ్యమంత్రి అనే గౌరవం దక్కుతుంది.
దీనికి ముందున్న టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఒకరు నిమ్మకాయల చినరాజప్ప కాగా మరొకరు కెఇ కృష్ణమూర్తి. కాపులకూ, బిసిలకూ ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పుకునేందుకు చంద్రబాబు ఆ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్, కాపులూ, బిసిలతో పాటు మైనారీటీలు, ఎస్సి, ఎస్టికు కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తున్న సందేశాన్ని ప్రజల్లోకి పంపదలచుకున్నారు.