చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డ్ను గురువారం ఆయన సందర్శించారు. టమాటా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదంటూ దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకుంటే రాజధాని అమరావతిలో రైతులతో కలిసి భారీ ప్రదర్శన (కవాతు) చేస్తానంటూ పవన్ హెచ్చరించారు.
ఈ ప్రభుత్వానికి మత మార్పిడిలపై ఉన్న ఉత్సాహం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో లేదని పవన్ విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో వైసిపి ప్రభుత్వానికి కూల్చడాలు, రద్దులు చేయడంతోనే సరిపోయిందని విమర్శించారు. రైతులు కష్టాలను తెలుసుకుందామని మార్కెట్ యార్డ్కు వస్తానంటే తనను ఆపాలని చూస్తారా అంటూ పవన్ నిప్పులు చెరిగారు. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోనే రకం కాదని అన్నారు. టమాటా రైతు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసిపి ఎమ్మెల్యేలు టమాటా రైతులకు గిట్టుబాటు ధరలపై త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేలా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
బుధవారం మధ్యాహ్నాం మార్కెట్ యార్డు సందర్శనకు పవన్ కళ్యాణ్కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డ్ వద్దకు వచ్చి ధర్నా చేస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించడంతో మార్కెట్ కమిటీ అధికారులు చివరికి పవన్ యార్డ్ సందర్శనకు అనుమతి ఇచ్చారు.