అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని చెప్పారు. ఎమ్మెల్యే రాపాక ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ.. గతంలో నేతలకు రాజకీయ విలువలు ఉండేవని, పార్టీ మారే నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారని చెప్పారు. ఇప్పుడు నేతలకు నిజాయతీ లేదని… నేతలు పార్టీలు మారినా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. జనసేన పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు వచ్చినట్టు… దానిపై తాను స్పందించినట్టుగా వస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలేనని, తాను జనసేనలోనే ఉన్నానని స్పష్ట చేశారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమస్యలపై కేడర్ స్పందించేలా బాధ్యతను అప్పగించాలని సూచించారు. అన్ని సమస్యలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతుంటే… పార్టీ బలోపేతం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కావాలనే బలమైన సంకల్పం పవన్ లో ఉండాలని… అప్పుడే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతానికైతే భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందని చెప్పారు.
‘ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణం. పార్టీ మారాలన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు భవిష్యత్ చూసుకోవాలి కదా’ అని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో కొన్ని మార్పులు జరగాలని.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకుంటే పార్టీ ముందుకెళ్లదన్నారు.
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నాయకులు పార్టీని వీడారని రాపాక ఆరోపించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని తెలిపారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని చెప్పారు. వ్యక్తిగతంగా నాదెండ్లతో తనకు ఇబ్బంది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగానే పవన్ దీక్షకు తాను హాజరుకాలేదని తెలిపారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపడితే తాను ప్రశంసిస్తానని చెప్పారు.
రాపాక వ్యవహారం ఇప్పుడు జనసేనలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో కలకలంరేగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రాపాకకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని.. అదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. దీంతో రాపాక ఎపిసోడ్కు పుల్స్టాప్ పడిపోయిందని అందరూ భావించారు. రాపాక తాజాగా పార్టీలో మార్పులు జరగాలని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు పార్టీతో కొంత గ్యాప్ ఉన్నట్లు రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, రాపాక తాజా వ్యాఖ్యలపై అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.