బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని కోరినట్లు తెలిపారు. మిగిలిన వారిలో ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడలను 12వ తేదీ వచ్చి తనను కలవాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.
ఇంతవరకూ ఒక్క తిరుగుబాటు శాసనసభ్యుడు కూడా వచ్చి తనను కలిసింది లేదని ఆయన పేర్కొన్నారు. ఒక అనర్హత పిటిషన్ తన దగ్గర పెండింగ్లో ఉందని స్పీకర్ చెప్పారు. రాజీనామాలపై గవర్నర్కు లేఖ రాశానని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఆయన సూచించారనీ, ఆ ప్రకారమే వ్యవహరిస్తాననీ రమేష్ కుమార్ అన్నారు.
అంతకు ముందు:
స్పీకర్ చేతిలో సంకీర్ణం భవిత!
కర్నాటక లోని కాంగ్రెస్ – జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం మనుగడ మంగళవారం మరింత ప్రశ్నార్ధకంగా మారింది. మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు రోషన్ బేగ్ ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు జరిగిన కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి 12 మంది సభ్యులు హాజరు కాకపోవడంతో అస్థిరత్వం ఇంకా ఎక్కువయింది. మరో ముగ్గురు సభ్యులు అనారోగ్యం కారణాలతో సమావేశానికి రాలేదు. కర్నాటక సంక్షోబాన్ని పరిష్కరించేందుకు సోనియా గాంధీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ను బెంగళూరు పంపారు.
ఇక రాష్ట్రప్రభుత్వ మనుగడ తాత్కాలికంగా అసెంబ్లీ స్పీకర్ చేతిలోకి వెళ్లింది. 13 మంది రాజీనామాలపై స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ తక్షణమే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిసిపోయింది. రాజీనామాలపై నిర్ణయానికి నిర్దిష్ట కాలపరిమితి లేదని మంగళవారం తన కార్యాలయానికి వచ్చిన స్పీకర్ పేర్కొన్నారు. పోస్టులో వచ్చిన రాజీనామాలను ఆమోదించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకూ ఎవరూ తనను కలిసేందుకు రాలేదని ఆయన అన్నారు. దీనితో సభ్యుల రాజీనామాలపై స్పీకర్ తీసుకోబోయే వైఖరి సూచనప్రాయంగా వెల్లడయింది. తాను రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభ్యులు ముంబైలో తాము బస చేసిన హోటల్ నుంచి గుర్తు తెలియని చోటికి మకాం మార్చారు. వారు బస చేసిన హోటల్ బయట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనకు దిగడంతో అసమ్మతి శాసనసభ్యులు రహస్యంగా మకాం మార్చారు. మరెవరూ ఫిరాయింపులకు పాల్పడకుండా నివారించడం కోసం జెడిఎస్ నాయకత్వం మిగతా వారిని బెంగళూరు శివారలలోని ఒక రిసార్టుకు తరలించింది.
ప్రభుత్వ పతనాన్ని నివారించే వ్యూహంలో భాగంగా మంత్రులందరూ రాజీనామా చేశారు. అయితే అసమ్మతి శానససభ్యులు ఎందరు అందుబాటులోకి వచ్చేదీ, అసలు వచ్చేదీ లేనిదీ తెలియదు. దీనికంతటికీ బిజెపి కారణమని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ ఆరోపించారు. అసమ్మతి సభ్యుడు హెచ్ నగేష్ ఛార్టర్డ్ విమానంలో ముంబై వెళ్లేముందు బెంగళూరు వమానాశ్రయంలో యడ్యూరప్ప అనుచరుడితో కలిసి కనబడ్డారు. యడ్యూరప్ప మనిషి తనను బలవంతంగా ముంబై తీసుకువెళుతున్నట్లు నగేష్ తనకు పోన్ చేసి చెప్పాడనీ, తాను చేరుకునేసరికి విమానం వెళ్లిపోయిందనీ శివకుమార్ పేర్కొన్నారు.