బెంగళూరు: కర్ణాటకలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన వృత్తికి రాజీనామా చేశారు. దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న ఎస్.శశికాంత్ సెంథిల్ అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ వ్యవస్థలో మార్పును తీసుకుని రావడం అసాధ్యమని భావించడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రజాస్వామ్య పునాదులు ఎన్నడూ లేనంత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ సర్వీసు నుంచి బయట ఉండటమే మంచిదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయమై ఆయన స్పందిస్తూ..‘ప్రజాస్వామ్య ప్రాథమిక పునాదులు అసాధారణ రీతిలో దెబ్బతిన్న వేళ ఓ ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికమని భావిస్తున్నాను. నా రాజీనామాతో ఏ వ్యక్తీకి ఎలాంటి సంబంధం లేదు. రాబోయే రోజుల్లో మన దేశపు సమాజంలోని మౌలిక స్వరూపానికి తీవ్రమైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయని నాకు అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా కంటే బయట ఉండటమే మంచిదనీ, అప్పుడే నా పనులను స్వేచ్ఛగా చేసుకోగలనని భావిస్తున్నా. ఇక నేను ఎంతమాత్రం సర్వీసులో కొనసాగలేను. విధుల నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు ప్రజలు నన్ను క్షమించాలి’ అని అన్నారు.
2009 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన శశికాంత్ సెంథిల్.. గత రెండేళ్లుగా దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఓ ఐఎఎస్ అధికారి తన సర్వీసుల నుంచి వైదొలగటం ఇది రెండోసారి. ఇటీవలే కేరళకు చెందిన కన్నన్ గోపీనాథ్ అనే ఐఏఎస్ అధికారి తన వృత్తికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతూ ఆగస్టు-21,2019న హోంసెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ రాశారు. తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని, గొంతు లేని వాళ్ల తరపున గొంతు వినిపించగలనని నమ్మి సర్వీసులో చేరానని, కానీ ఇప్పుడు తన సొంత గొంతును కూడా విప్పలేకపోతున్నానని,తన రాజీనామా తిరిగి తనకు తన వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుందని గోపీనాథన్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే, IAS ఆఫీసర్లు ఇలా ఒక్కొక్కరుగా వైదొలగడం చర్చనీయాంశమైంది.