(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఏం చెయ్యాలన్న వ్యూహం చుట్టూ ప్రతిపక్ష పార్టీల చర్చలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిన్నటినుంచీ వివిధ రాజకీయపార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు.
దానికి ముందు చంద్రబాబు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం సిపిఐ నాయకులు సురవరం సుధాకర రెడ్డి, డి.రాజాలతో సమావేశమయ్యారు. అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్, జనతాదళ్ నేత శరద్ యాదవ్లను కూడా కలుసుకున్నారు. సాయంత్రం లక్నోలో సమాజ్వాదీ పార్టీ నా.కుడు అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. బిఎస్పి నేత మాయావతిని కూడా కలుసుకోనున్నారు.
బిజెపికి 2014లో వచ్చినట్లు సగంకన్నా ఎక్కువ సీట్లు ఈసారి రాకపోయినా అది అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలవడం ఖాయమని అందరూ అంచనా వేస్తున్న నేపధ్యంలో ఎన్డీయేతర పార్టీల చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీల మద్దతుతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వస్తే యుపిఎ పార్టీలు చేయగలిగిందేమీ ఉండదు. అలా కాకుండా ఇంకా సంఖ్యాబలం అవసరం అయినపుడు బిజెపి, అటు తమకూ, ఇటు యుపిఎకూ దూరంగా ఉన్న మిగతా పార్టీల వైపు చూడకతప్పదు. అలాంటపుడు ఏం చేయాలన్నది ఇప్పుడు ఎన్డీయేతర పార్టీల ముందున్న ప్రశ్న.
అలాంటి పరిస్థితి తలెత్తినపుడు తెలంగాణాలోని టిఆర్ఎస్, ఆంధ్రాలోని వైసిపి, ఒదిషాలోని బిజూ జనతాదళ్ వైపు బిజెపి చూస్తుంది. ఈ పార్టీల మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా నిరోధించడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటుకు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కెసిఆర్, నవీన్ పట్నాయక్ వంటి నేతలకు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు.
ఎన్నికల ముందే పొత్తు ఉన్న పార్టీల ఐక్య సంఘటనకు మెజారిటీ వచ్చిన పక్షంలో దానినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అలా కాని పక్షంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద పార్టీకి ఆహ్వానం అందుతుంది. అలా జరిగినపుడు మోదీ, అమిత్ షా ద్వయం రకరకాల పద్ధతులలో ప్రతిపక్ష సభ్యులను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటారని యుపిఎ నేతలతో పాటు, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ వంటి నాయకులు కూడా భయపడుతున్నారు. దీనిని నివారించడం ఎలా అన్న దానిపై దృష్టి సారిస్తున్నారు.