(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్మటీ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన బేక్ ఎయిర్కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో సిబ్బంది సహా 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఆల్మటీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని విమానం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.22 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగే సమయానికి విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ విమానం ఆల్మటీ నుంచి కజికిస్థాన్ రాజధాని నూర్-సుల్తాన్కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కొంత మంది సురక్షితంగా బయటపడ్డారని ఆల్మటీ విమానాశ్రయం అధికారులు తెలిపారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆల్మటీ ఎయిర్పోర్టు నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్ సంకేతాలు తెగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎయిర్ పోర్టుకి సమీపంలోనే విమానం కుప్పకూలినట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం కారణంగా పలు విమానాలను రద్దుచేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్రమాదంపై కజకిస్థాన్ ప్రెసిడెంట్ క్యాసమ్ జోమార్ట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.