అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదైతే యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారో వైకాపా మేధావులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందనీ, అద్భుతమైన నగరంగా కడతామని జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తుంటే అడుగుకో పోలీసుని పెట్టారని అన్నారు. ప్రతి ఇంటి దగ్గరా అయిదుగురు పోలీసులు, ముళ్ల కంచెలు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులా అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత గ్రామాల్లో పోలీసు బందోబస్తు చర్యల వీడియోను ట్యాగ్ చేశారు.
అడుగుకో పోలీస్ ని పెట్టారు. ప్రతి ఇంటి దగ్గరా 5గురు పోలీసులా? ముళ్ల కంచెలు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులా? ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు.(2/2)#MyCapitalAmaravati#SpreadDevelopmentNotHate
— Lokesh Nara (@naralokesh) December 27, 2019