(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ జస్టిస్ ఫర్ దిశ హత్య సంఘటనపై స్పందించిన పోలీసులు ప్రతి కిరణం షాప్, పెట్రోల్ బంకులో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు షాద్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ విజయభాస్కర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పెట్రోల్ బంకులకు లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు, డబ్బాలు తీసుకొని వస్తే పెట్రోల్ పొయ్యవద్దని నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు వస్తే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వలని కోరారు.
పెట్రోలుబంకుల్లో ఖాళీ బాటిల్స్ లో ఫీల్ చేసి ఇవ్వొద్దు అని గతంలో ఎన్నోసార్లు అధికారులు హెచ్చరించినప్పటికీ ఏ పెట్రోల్ బంకులు ఈ రూల్స్ ను పాటించకుండా వ్యవహరిస్తూ వచ్చాయి. నిజానికి అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు, పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే. రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమానులు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనల తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. వాహన దారుల పరిస్థితి గమనించి అమ్ముతానంటున్నారు. అయితే, పోలీసుల తాజా ఆదేశాలతో పూర్తిస్తాయిలో ఆపేస్తామని పలు పెట్రోల్ బంకు నిర్వహకులు చెబుతున్నారు.
మరోవైపు బంక్ యజమానుల ఆదేశాలనుసారం తాము బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం లేదని.. అది ఎప్పటి నుంచో అమల్లో ఉందని బంక్ లో పని చేసే ఉద్యోగులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోయడం వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. పెట్రోల్ ను బాటిళ్లో తీసుకెళ్లి ఎమ్మార్వో హత్య చేశారు. అదే తరహాలో వెటర్నరీ డాక్టర్ దిశను హత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైద్యురాలు దిశ హత్యలో నిందితులను పట్టుకోవడంలో సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు కీలకంగా మారాయి. మృగాళ్లు సంచరిస్తున్న దృశాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో పోలీసులు 24 గంటల్లో ఈ కేసును ఛేదించారు. చాలా ఘటనల్లో నిందితులను సీసీ కెమెరాలు పట్టించాయి. అయితే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బంకులో బాటిళ్లు, డబ్బాలు తీసుకొచ్చే వారికి పెట్రోల్ అమ్మకుండా ఉంటే ‘దిశ’ లాంటి ఘటనలు జరగవని చెప్పలేం. కఠిన చట్టాలు, శిక్షలు అమలు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని సగటు సామాన్యుడు చెబుతున్న మాట.