గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలోనే ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
అయితే సీబీఐ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని, కోర్టు అనుమతి వచ్చిన విషయం కూడా తమ న్యాయవాది ద్వారా తెలుసుకున్నామని ఆయేషా తల్లి శంషాద్బేగం పేర్కొన్నారు. తమ మతాచారాలకు విరుద్ధమైనా, కేసు విచారణ ముందుకు సాగి, దోషులకు శిక్ష పడాలనే ఆలోచనతో రీ పోస్టుమార్టానికి అంగీకరిస్తున్నట్టు చెప్పారు.
2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పటికీ అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి మంత్రి కోనేరు రంగారావు కొడుకు, హాస్టల్ వార్డెన్, కొందరు విద్యార్థులపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులు ఎవరన్నది తేలుతుందా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.