(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఆవులను పెంచాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ‘ఆవు విశ్వానికి తల్లి. ఆవుల పెంపకం వల్ల ఖైదీల మానసిక స్థితిని మార్చవచ్చు. ఖైదీల మనసులు పువ్వుల్లా మారతాయి. కొందరు జైలర్లు నాకు దీన్ని సూచించారు. దేశంలోని అన్ని జైళ్లలో గోశాలలను ఏర్పాటు చేయాలి. వాటి ఏర్పాటుకు ముందు, తర్వాత ఖైదీల్లో వచ్చిన మార్పులను నమోదు చేసి, మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలి. అన్ని జైళ్లలో మార్పులు వస్తే ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు ’ అని వ్యాఖ్యానించారు.
ఆవుకు మన దేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యముందని, విదేశీయులు మాత్రం దాన్ని కేవలం ఒక సరుకుగా చూస్తారని పేర్కొన్నారు. ‘విదేశీయులకు ఆవు అంటే పాలు, మాంసమే. కానీ, మన భారతీయులకు దానితో బలమైన మానసిక బంధం ఉంటుంది. ఆవును వ్యాపార వస్తువుగా చూడరు. ఆవు తల్లి లాంటిది. మనుషులకు రోగాలు రాకుండా చూస్తుంది’ అని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు ఆవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.