హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈడీ సభ్యుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ భవనంలో ఈ చర్చలు జరగ్గా… దీనికి ఆర్టీసీ జేఏసీ తరపున అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులను మాత్రమే అనుమతించారు. ఆర్టీసీ యాజమాన్యం 21 డిమాండ్లపై చర్చలకు సిద్దం కాగా.. కార్మిక నేతలు మాత్రం మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని పట్టుబడ్డారు. నేతల డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇక ఈ సమావేశాన్ని మొత్తం వీడియో తీసిన ప్రభుత్వం.. ఆ సీడీని కోర్టుకు సమర్పించనుంది.
ప్రభుత్వం కేవలం కోర్టుకు జవాబు చెప్పాలి కాబట్టి కంటితుడుపు చర్యగా చర్చలకు వచ్చింది తప్పితే.. చర్చల పరిష్కారంపై చిత్తశుద్దితో ముందుకొచ్చినట్టు కనిపించలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. నిర్బంధం మధ్యలో తమను చర్చలకు పిలిచారని.. లోపలికి వెళ్లగానే సెల్ఫోన్లు లాక్కున్నారని ఆరోపించారు. తమ ఫోన్లు తీసుకోవడానికే వాళ్లకు అరగంట సమయం పట్టిందని, డిమాండ్లపై అసలు చర్చించనే లేదని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ తరుపున కనీసం ఎనిమిది మందిని లోపలికి అనుమతించాలని కోరినా.. అందుకు ఒప్పుకోలేదన్నారు. తెలంగాణ మజ్దూర్ ఇచ్చిన 46 డిమాండ్లు లేదా జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లపై చర్చలు జరపాలని తాము కోరామని.. కానీ అధికారులు మాత్రం కేవలం 21 డిమాండ్లపై చర్చించాలని హైకోర్టు సూచించిందని వాదిస్తున్నారని చెప్పారు. హైకోర్టు సూచనలకు ఆర్టీసీ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేజీ నం.7,8వ పేజీల్లో తెలిపినట్టుగా 26 డిమాండ్లపై చర్చించాలని తాము పట్టుబట్టామని తెలిపారు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కనపెట్టి.. కనీసం చర్చలు జరపాలని కోరినా వినిపించుకోలేదన్నారు. ప్రభుత్వం పునరాలోచించుకుని అన్ని డిమాండ్లపై చర్చలకు పిలిస్తే ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని.. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమస్యలపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీలతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఆధ్యయనం చేసి తమ నివేదికను సంస్థ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మకు శుక్రవారం ఉదయం సమర్పించింది. దాన్ని ఆయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అందజేశారు. ఆయన సీఎం కేసీఆర్కు సమర్పించగా.. ప్రగతి భవన్లో శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈడీల కమిటీ నివేదిక, హైకోర్టు ఉత్తర్వులు, ఆర్టీసీ సమ్మె పర్యావసనాలు తదితర అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారంలేని అంశాలపై సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు పలు సమస్యలపై కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత 22 రోజులుగా రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు చర్చలు ఫలించి బస్సులు రోడ్డెక్కుతాయానని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగనుంది.