న్యూస్ ఆర్బిట్ డెస్క్
రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మౌనమే సంకేతమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఇంటలిజెన్స్ యంత్రాంగంతో సర్వే చేయించిందనీ, అందులో తెలుగుదేశం గెలుస్తోందని తేలడంతో కెసిఆర్ ఇక గమ్మునుండడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు.
కెసిఆర్ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచిన దగ్గరనుంచీ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడుతూ వచ్చారు. బాబుకు రిటర్న్ గిప్ట్ ఇవ్వడం ఖాయమని ఒకటికి రెండు సార్లు అన్నారు. ఆంద్రప్రదేశ్ ఎన్నికలు సమీపించిన తర్వాత కూడా ఆ మాటల దాడి అగలేదు. ఎన్నికల ముందు సమరశంఖారావం సభల్లో చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. వైఎస్ జగన్ను గెలిపించడం కోసం మోదీ తరపున కెసిఆర్ రంగంలోకి దిగారని చంద్రబాబు విమర్శించడం మొదలుపెట్టిన తర్వాత కెసిఆర్ దూకుడు తగ్గింది. అయితే ఆయన కుమారుడి దూకుడు మాత్రం తగ్గలేదు. కొద్దిరోజుల క్రితం వరకూ కెటిఆర్, చంద్రబాబు ఇంటికి వెళ్లకతప్పదని అంటూనే ఉన్నారు. కానీ పోలింగ్ తర్వాత మొత్తం మీద తేడా వచ్చింది. మొన్నటికి మొన్న ట్విట్టర్లో ప్రజలకు సమాధానాలిస్తూ, ఎపిలో ఫలితం గురించి వచ్చిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు.
ఈ మార్పునకు కారణం అయ్యన్నపాత్రుడు చెప్పినట్లు ఎపిలో టిడిపి విజయం ఖాయమని వారు భావించడమేనా? కెసిఆర్ ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కామెంట్లేమీ చేయడం లేదు. అంతవరకూ నిజమే. చంద్రబాబు అంటే ఒంటి కాలిపై లేచే ఆయన కుమారుడు కెటిఆర్ కూడా కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారన్న మాట కూడా నిజం. అయితే అందుకు అయ్యన్నపాత్రుడు చెబుతున్న కారణం కూడా నిజమేనా?
తెలంగాణ ఇంటలిజెన్స్ చేసిన సర్వే అంటూ ఏప్రిల్ 11 తర్వాత ఒక సర్వే వివరాలు సోషల్ మీడియాలో తిరిగాయి. అందులో టిడిపి గెలుస్తున్నట్లుగా చూపించిన మాట నిజమే కానీ ఆ సర్వే నమ్మదగినది కాదు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగం చేసిన సర్వే అంటూ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇవే కాకుండా లగడపాటి రాజగోపాల్ టీము చేసిన సర్వే అంటూ ఇంకొకటి కూడా వచ్చింది. ఇవన్నీ బూటకపు సర్వేలు తప్ప మరోటి కాదు.
రాష్ట్రంలో పోలింగ్కూ కౌంటింగ్కూ మధ్య ఎన్నడూ లేనంతగా 40 రోజుల వ్యవధి ఉండడం వల్ల రాజకీయపార్టీల వారికే కాకుండా రాజకీయాలంటే కాస్తోకూస్తో ఆసక్తి ఉండే సామాన్య ప్రజలకు కూడా ఉత్కంఠ తెగడం లేదు. ఫలితంగా రకరకాల వార్తలు, జోస్యాలు చలామణలోకి వస్తున్నాయి. జోరుగా సాగుతున్న బెట్టింగ్కు ఇవి ఆజ్యం పోస్తున్నాయి. మరోరకంగా చెప్పాలంటే బెట్టింగ్ జోరుగా సాగేందుకే ఇలాంటి వార్తలు పుట్టకువస్తున్నాయని కూడా అనొచ్చు.
ఏ సర్వే నిజం ఏ సర్వే అబద్ధం అన్న సంగతి అలా ఉంచితే కెసిఆర్, కెటిఆర్ మౌనానికి అయ్యన్నపాత్రుడు చెప్పిన మాట కారణం కావచ్చు కాకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం. కెసిఆర్ ఏది మాట్లాడినా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడకపోయినా దాని వెనుక కూడా వ్యూహం తప్పక ఉంటుంది.