(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత సోము వీర్రాజు రాజధాని నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై చంద్రబాబు తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు తెలివైన రాజకీయం ప్రదర్శిస్తుంటే, ఆయన ట్రాప్ లో జగన్ పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పదేపదే హైదరాబాద్ లాంటి అభివృద్ధి అని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ వల్లే రాష్ట్ర విభజన ఇబ్బందులు వచ్చాయని సోము వీర్రాజు గుర్తుచేశారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో చంద్రబాబు తన పాలనలో ఒక్క పోర్టు అయినా నిర్మించారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మాట అంటున్నానంటే తానేదో వైఎస్సార్ను పొగుడుతున్నానని కాదని గుర్తుంచుకోవాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రతనాల సీమగా మారాలన్నారు. ప్రస్తుతం పోర్టులు కట్టేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని.. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. త్వరలో 25 జిల్లాలుగా విభజన చేస్తారని.. బీజేపీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తోందని సోము వీర్రాజు తెలిపారు.
సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే రాజధానిపై జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్ధతిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు నేతలు రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే.
మరోవైపు తుళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు.. వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీయేతర పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.