న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ పిటిషన్లపై ప్రత్యేక ఛాంబర్లో విచారణ జరిపింది. తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను సీజేఐ తిరస్కరించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాతో పాటు మరో 40 మంది రివ్యూ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. నవంబరు 9న ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చి చెప్పింది.
అయెధ్య భూవివాదంపై నవంబర్ 9న అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సంచలనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు అప్పగించాలని తీర్పులో పేర్కింది. సున్నీ వక్ఫ్ బోర్డకు ఐదెకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. అనంతరం మరో 16 పిటిషన్లు దాఖలయ్యాయి.