అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నదానిపై ఊహాగానాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి.
ప్రభుత్వం రెండు రోజుల క్రితం వంశీని రూల్స్ కమిటీ సభ్యుడుగా నియమించింది. ఒకపక్క గతంలో సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వంశీ, ఆ తర్వాత అధికారపక్షం వేధింపుల గురించి మాట్లాడిన విషయం విదితమే. ఇప్పుడు ఈ నియామకంతో వంశీ నోట వచ్చిన వేధింపుల మాటలు కట్టుకథలేనా అన్న అనుమానం కలుగుతోంది.
గత నెల చివరి వారంలో పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన వల్లభనేని వంశీ ఆ తరువాత కొద్ది రోజులకు మాయం అయ్యారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వంశీ ఈ నెల మొదటి వారంలో వైసిపి చేరనున్నారని వార్తలు వచ్చాయి. తొలుత బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని, తరువాత ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని ఆయన కలిసి చర్చించిన విషయం అందరికీ తెలిసిందే.
వంశీని బుజ్జగించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, బందరు మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించగా వారు వంశీతో చర్చించారు. వంశీతో చర్చించిన తర్వాత కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ పార్టీ అండగా ఉంటుందని చెప్పామనీ, నిర్ణయం తీసుకోవాల్సింది ఇక వంశీయేనని పేర్కొన్నారు.
మరో పక్క వంశీ చేరికను గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వంశీ స్పీకర్కు రాజీనామా లేఖ పంపకపోవడాన్ని టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ మారే హక్కు ఎవరికైనా ఉంటుందంటూ, వాట్స్ఆప్ ద్వారా రాజీనామాలు పంపడం ఏమిటని ప్రశ్నించారు. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ పంపారు తప్ప స్పీకర్కు పంపలేదు.
చంద్రబాబుకు వంశీ పంపిన రాజీనామా లేఖలో తన వర్గీయులకు అధికార పార్టీ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడంతో పాటు రాజకీయాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కూడా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రోజులు గడుస్తుండటంతో వంశీ చేరికకు అధికార పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదా లేక వేరే ఏమైనా ఆలోచన చేస్తున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.