అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టిడిపి సభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన వద్ద నాడు జగన్మోహనరెడ్డి ప్రకటించిన ఆడియో, వీడియో సాక్షంతో పాటు సాక్షి పత్రికలో వచ్చిన కథనం కూడా ఉందని రామానాయుడు పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు చెందిన వారికి 45ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చినట్లు నాడు సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించారనీ, ఒక వేళ వారు ఆ హామీ ఇవ్వకుంటే సాక్షి పత్రికలో వచ్చిన కథనం తప్పనీ, తప్పుడు వార్తను ప్రచురితం చేశారని సభాసాక్షిగా తెలియజేయాలని రామానాయుడు పట్టుబట్టారు.
దీనిపై చర్చ రసాభాసగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ 45ఏళ్లకే పెన్షన్ అనే అంశాన్ని మానిఫెస్టోలో పేర్కొనలేదని తెలిపారు. ఈ సందర్భంలో సిఎం జగన్మోహనరెడ్డి జోక్యం చేసుకొని ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలనే మానిఫెస్టోలో చేర్చామనీ, అబద్దాలు చెప్పడం, మాట తప్పడం తమ చరిత్రలో లేదని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సభలో తన ప్రసంగాన్ని ప్లే చేయించారు. ఆ వీడియోలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్ల నుండే పెన్షన్ ఇస్తామని ప్రకటిస్తే 45ఏళ్లకే పెన్షన్ ఏమిటని విమర్శలు రావడంతో వాటిని పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించామనీ, ఆ వర్గాలకు అక్షరాల 75వేల రూపాయలు చెల్లిస్తామని జగన్ ప్రకటించినట్లు వీడియోలో ఉంది. తన మాటలను వక్రీకరించి టిడిపి సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు.
ఈ అంశంపై టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ముగ్గురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. టిడిపి సభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉప సభాపతి కోన రఘుపతి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ వీరిని సస్పె న్షన్ అమలులో ఉంటుందని డిప్యూటి స్పీకర్ ప్రకటించారు.
అనంతరం టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిలు డిప్యూటి స్పీకర్ కోన రఘుపతిని కలిసి తమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. వారి వినతిని డిప్యూటి స్పీకర్ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టిడిపి సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.