అమరావతి: ఏపి అసెంబ్లీలో నేడు మరో నలుగురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు, అసెంబ్లీలో గురువారం కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంలో నెలకొన్న గందరగోళం వీరి సస్పెన్షన్కు దారి తీసింది. ఈ సస్పెన్షన్ను నిరసిస్తూ మిగిలిన సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు.
అసెంబ్లీలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీల చర్చ జరుగుతున్న సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతున్న సమయంలో టిడిపి సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న టిడిపి సభ్యులను మార్షల్స్తో బయటకు పంపించాలని జగన్ కోరారు. అనంతరం అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి టిడిపి సభ్యులు అశోక్ బెందాళం, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ బాబు, డోల బలాంజనేయులులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ నలుగురు సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం మార్షల్స్ ద్వారా వారిని బలవంతంగా బయటకు పంపారు. వీరి సస్పెన్షన్ను నిరసిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల ముగ్గురు టిడిపి సభ్యులను బడ్జెట్ సెషన్స్ పూర్తి అయ్యే వరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.