అమరావతి: ఏపీలో శాసన మండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు అధికార పార్టీ వల విసురుతోందని తెలుస్తోంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో మండలి రద్దు దిశగా సీఎం జగన్ సంకేతాలిచ్చారు. శాసన మండలిని కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే విషయమై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చించనున్నారు. అయితే, మండలిలో బలం పెంచుకోవడం కోసం వైసీపీ ఇతర పార్టీల ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలతో మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వస్తే.. అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ను తొలగించాలని.. తర్వాత అధికార పార్టీ సభ్యుణ్ని చైర్మన్ చేయాలనేది వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీ శాసనసభాపక్ష సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్సీలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత వైసీపీలో చేరగా.. శివనాగిరెడ్డి జగన్ సర్కారుకు మద్దతు ఇచ్చారు. తాజాగా టీడీఎల్పీ సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉండడటం హాట్ టాపిక్ గా మారింది. వీరు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కావడం లేదని శత్రుచర్ల, కేఈ ప్రభాకర్, సరస్వతి, శమంతకమణి, తిప్పేస్వామి పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు తమ ఎమ్మెల్సీలకు గాలం వేస్తుండటంతో టీడీపీ అప్రమత్తమైంది. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్సీలతో ఫోన్లో మాట్లాడారు. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడుతూ.. వారు చేజారిపోకుండా చూసే బాధ్యతలను పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడికి చంద్రబాబు అప్పగించారు.
ఇదిఇలాం ఉంటే.. సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను.. అసెంబ్లీతోపాటు శాసన మండలిలో ఆమోదింపజేసుకోవాలని అధికార వైసీపీ భారీ ప్లాన్ వేసిందని ప్రతిపక్షం అంటోంది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు, కీలక పదవి ఇస్తామని వైఎస్సార్సీపీ ఆశ చూపుతోందని ఆరోపిస్తోంది. అంతేకాదు మండలిలో బలం పెంచుకోవడం కోసం వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్సీలకు గాలం వేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ప్రయత్నాలతో మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వస్తే.. అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ను తొలగించాలని.. తర్వాత అధికార పార్టీ సభ్యుణ్ని చైర్మన్ చేయాలనేది వైసీపీ ప్లాన్ అని ప్రతిపక్ష నేతల ఆరోపణ.
మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు శాసనమండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. మండలిలో రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీసు ఇవ్వగా.. మండలి చైర్మన్ షరీఫ్ చర్చకు అనుమతించారు. జనవరి 22న సభలో వాడీ-వేడిగా చర్చ జరిగిన తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో టీడీపీ పైచేయి సాధించగా.. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రం షాకిచ్చారు. శాసనమండలిలో రూల్ 71పై జరిగిన ఓటింగ్లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటేశారు.
ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచార జోరుగా సాగుతోంది. వైపీపీ నేతల వ్యూహం గమనిస్తే..మండలి రద్దుపైన చివరి నిమిషం వరకు ఖాయమనే ప్రచారం సాగిస్తూ.. తమ పని పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. మండలిలో ప్రస్తుతం టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ఇంకా కొనసాగించ కూడదని అధికార పార్టీ గట్టి పట్టదలతో కనిపిస్తోంది. కీలకమైన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం ద్వారా..ప్రభుత్వం మండలిలో టీడీపీ తీరును చాలా సీరియస్ గా తీసుకుంది. మండలి రద్దు దిశగా అడుగులు వేసి..పరిస్థితిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొనే వ్యూహం అమలు చేస్తోంది. మండలి రద్దు ఖాయమని చెబుతూనే.. కొందరిని తమ దారిలో తెచ్చుకోవాలని ప్రణాళిక వేస్తోంది. టీడీపీలో చీలక వచ్చి..ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరకున్నా..ప్రత్యేక గ్రూపుగా సభలో గుర్తింపు పొందేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూపు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా సభలో టీడీపీ మెజార్టీకి గండి కొట్టటంతో పాటుగా తాము అనుకున్న విధంగా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన బిల్లుల పైన మరో వ్యూహంతో ముందుకెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తోంది.