అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే రాజధాని ప్రాంత రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలుత కేబినెట్ భేటీ సచివాలయంలో నిర్వహించాలా ? లేక తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలా అన్న విషయంపై చర్చ జరగ్గా సచివాలయంలోనే నిర్వహించాలని సిఎం సూచించారు. కేబినెట్ భేటీలో జిఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రైతుల ఆందోళన, సిఆర్డిఎ వ్యవహారాలపైనా చర్చించనున్నారు. రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.