(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న విషయ బహిర్గతమైంది. అయితే అది వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావించేవరకూ వెళ్లిందా? అంటే అవును అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణే. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 8న పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా మంత్రివర్గంలో మరో ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే, మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో టీఆర్ఎస్ లో నిరసన గళం బయటకు వచ్చింది. తమకు అన్యాయం జరిగిందని నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని, ఎమ్మెల్యేలు రాజయ్య, జోగురామన్న లాంటి వారు మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాయిని తన మనసులో ఉన్నదాన్ని మీడియా ముందే బయటపెట్టేశారు. అల్లుడికి ఎమ్మెల్సీ, తనకు మంత్రి పదవి అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. జోగు రామన్న తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని, గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య కూడా అసంతృప్తిని వెలిబుచ్చారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆయన అసహనంతో ఉన్నారు. ఇప్పటికైతే వీళ్లు బయటపడ్డారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని భంగపడ్డ మరికొంత మంది మాత్రం తమ అసంతృప్తిని బయట పెట్టకుండా లోలోపలే రగిలిపోతున్నారట.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్దన్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు లాంటి వారు సైతం కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మైనంపల్లి ఆఫీస్ లో సమావేశమై.. తమ భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు సమాచారం. ఈ ముగ్గురూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ అధిష్ఠానంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలకు వల విసురుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ ఇప్పటికే బీజేపీ నేతలు స్పీచ్ లు ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ తెలంగాణలో క్రమంగా పుంజుకుంది. టీఆర్ఎస్ను ఢీ కొట్టే దిశగా ఆపార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే భారీగా వలసలను ప్రోత్సాహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని టీడీపీ, కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేతలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా అధికార టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు టీఆర్ఎస్ లోని కీలక నేతలు కేసీఆర్ తీరుతో విసిగిపోయారని, అందుకనే తమ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని స్టేట్మెంట్ లు కూడా ఇచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జూపల్లి, మైనంపల్లి, బాజీరెడ్డిలు రహస్యంగా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ లో ఉండడం కంటే బీజేపీలోకి వెళ్తే.. రాజకీయంగా తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని వీరు భావిస్తున్నారట. ఈ నెల 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకోవాలని వీరు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి బాటలోనే మరికొంత మంది నాయకులు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ హైకమాండ్ యొక్క వైఖరి నచ్చక మల్లగుల్లాలు పడుతున్న నేతలు ఏం చేయాలో పాలుపోని స్థితి లో ఉన్నారట. మొత్తానికి గులాబీ నేతల్లో అంతర్గతంగా ఉన్న అధిష్టానంపై వ్యతిరేక భావన ఏదో ఒక రోజు తప్పక బహిర్గతమవుతుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.