హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున డిపోల వద్దకు వచ్చారు. అధికారుల సమాచారంతో ముందుగానే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల వద్ద సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు.
డిపోలకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి లేదని.. వచ్చిన కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందికి ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు డిపోల వద్ద సోమవారం రాత్రి నుంచే జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో డిపోల వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేసి.. స్టేషన్ లకు తరలించారు. విధుల కోసం వస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుండడంతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు ఆటంకం కలిగిస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కాగా, గత 52 రోజుల పాటు సమ్మె కొనసాగించిన కార్మికులు.. జేఏసీ సూచనతో డిపోల వద్దకు వస్తున్నారు. అయితే, కార్మికులు ఎవ్వరూ డిపోలకు రావొద్దని, వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.