అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పక్క పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా మరో పక్క జగన్ సర్కార్ ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం మరో ఆందోళనకర అంశంగా మారింది. తన నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను తనకు కేటాయించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం విదితమే.
దీనిపై సిఎం జగన్ ఏ నిర్ణయం తీసుకోకముందే చంద్రబాబు ఉంటున్న నివాసాన్నే ఖాళీ చేయిస్తామనీ, ఆయన ఉంటున్న భవనం కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణమని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించి ఉన్నారు. ఇదే విషయంపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా. . ఈ నెల 24న కలెక్టర్ ల కాన్ఫిరెన్స్ ఈ ప్రజావేదికలోని సమావేశ మందిరంలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో శుక్రవారం సీఆర్డీఏ, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రజావేదికను పరిశీలించారు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఆ వస్తువులను తీసుకెళ్లాలని పార్టీ నేతలకు అధికారులు ఆదేశించారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఊహించని ఈ రెండు సంఘటనలు జరగడం టిడిపికి షాక్ ల మీద షాక్ తగిలినట్లుగా భావిస్తున్నారు.